డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. నైనిటాల్లో మంగళవారం వర్చువల్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలపై మండిపడ్డారు. ఓటుబ్యాంకు విధానాలతో కాంగ్రెస్ ప్రజల్లో విషబీజాలు నాటిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ను మట్టికరిపించి బీజేపీని ఆదరించాలని ఆయన ఓటర్లకు పిలుపు ఇచ్చారు. బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం రూ 12,000 కోట్లతో చార్ ధాం రోడ్డు ప్రాజెక్టు పనులను 90 శాతం పూర్తిచేసిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక కుటుంబ బాగు కోసమే పాటుపడిందని, అవినీతితో అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేసిందని ఆరోపించారు. ఏండ్ల తరబడి అధికారంలో ఉన్నా ఉత్తరాఖండ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని మోదీ మండిపడ్డారు. ఉత్తరాఖండ్ అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవద్దని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఆదరించి పొరపాటు చేయవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఉత్తరాఖండ్, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఉత్తరాఖండ్ అభివృద్ధి నత్తనడకన సాగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరాఖండ్ కలలను చిదిమివేసిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఉత్తరాంఖండ్ను సృష్టించిన వారు..దాన్ని అడ్డుకున్న వారి మధ్య పోరాటంగా అభివర్ణించారు. ఇక ఫిబ్రవరి 14న ఒకే దశలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా అందలం ఎక్కాలని విపక్ష కాంగ్రెస్ పావులు కదుపుతోంది.