డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ఉధృతం చేసింది. శ్రీనగర్లో జరిగిన విజయ్ సంకల్ప్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం దేశ తొలి సీడీఎస్ చీఫ్, దివంగత జనరల్ బిపిన్ రావత్ పేరును కాంగ్రెస్ వాడుకుంటోందని దుయ్యబట్టారు. బిపిన్ రావత్ సేవలను ప్రధాని మోదీ గుర్తుచేసుకుంటూ ఉత్తరాఖండ్ ప్రజలు ఎప్పటికీ దేశాన్ని కాపాడుతుంటారని అన్నారు. పౌరీ గర్వాల్కు చెందిన జనరల్ బిపిన్ రావత్తో తన అనుబంధం భావోద్వేగంతో ముడిపడినదని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ప్రజల సాహసం సమున్నత శిఖరాల వంటిదనే కాకుండా హిమాలయాల అంతటి ఆలోచన తమదని జనరల్ బిపిన్ రావత్ దేశానికి చాటిచెప్పారని కొనియాడారు. ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ భారత సైన్యం పట్ల వ్యవహరించిన తీరును ఉత్తరాఖండ్ ప్రజలు ఎన్నటికీ మరువరని అన్నారు.
కొందరు కాంగ్రెస్ నేతలు సర్జికల్ స్ట్రైక్కు ఆధారాలు అడిగిన సంగతి తనకు గుర్తుందని ప్రధాని మోదీ చెప్పారు. సీడీఎస్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ గత ఏడాది డిసెంబర్లో తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రావత్ భార్య మధూలిక రావత్, మరో 12 మంది సిబ్బంది మరణించారు. ఇక ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. పలు వర్గాల ఓటర్లపై కాషాయ పార్టీ వరాల జల్లు కురిపించింది. తాము అధికారంలోకి వస్తే లవ్ జిహాద్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. లవ్ జిహాద్ కేసుల్లో పదేండ్ల జైలు శిక్ష విధిస్తామని పేర్కొంది. ఛార్దాం హైవేను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.
ఉత్తరాఖండ్లో చూస్తున్న అభివృద్ధి పనులు కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ యువతకు 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఉత్తరాఖండ్ను స్వయం సమృద్ధి సాధించేలా రూపొందిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఏడాది మూడు ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, గర్భిణులకు రూ 40,000 సాయం అందిస్తామని మ్యానిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే ఫించన్లను రూ 3600కు పెంచుతామని స్పష్టం చేసింది.ఇక ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 14న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.