PM Modi : ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) లో భారీ భూకంపం (Earthquake) సంభవించి 800 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తులో కుటుంబసభ్యులను, సన్నిహితులను కోల్పోయిన వారికి తగిన శక్తినివ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్కు అన్ని రకాల మనవతా సాయం అందించి, ఆ దేశాన్ని ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని ప్రకటించారు.
ఆఫ్ఘనిస్థాన్లో ఆదివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0 గా నమోదైంది. ఈ ఘోర విపత్తు ధాటికి 800 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ‘రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్థాన్’ వెల్లడించింది. మరో 3000 మంది వరకు గాయపడినట్లు తెలిపింది. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమైనట్లు వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ చెప్పారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని, అసమర్థ తాలిబన్ ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. ఈ ఆపద సమయంలో అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.