PM Modi | న్యూఢిల్లీ, మే 29: దేశ జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మాగాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీపై 1982లో సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని గత కేంద్ర ప్రభుత్వాలు గాంధీ గురించి తగిన విధంగా ప్రచారం చేయలేదని విమర్శలు చేశారు. గత 75 ఏండ్ల కాలంలో గాంధీకి అత్యున్నత ప్రపంచ ఖ్యాతిని తీసుకురావడం మన బాధ్యత కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఏబీపీ న్యూస్ చానెల్కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గాంధీజీ చాలా గొప్ప వ్యక్తి. కానీ ఆయన గురించి ఎవరికీ తెలియదని చెబుతున్నందుకు నన్ను క్షమించండి. 1982లో ఆయనపై సినిమా తీసే వరకు గాంధీ గురించి ప్రపంచానికి తెలియదు.
సినిమా తర్వాత అతను ఎవరనే విషయాన్ని తెలుసుకొనేందుకు ప్రపంచం ఆసక్తి చూపింది. చేయాల్సిన పని మనం చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా గురించి ప్రపంచానికి తెలిస్తే, మహాత్మా గాంధీ కూడా వారికంటే తక్కువేమీ కాదు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరిగిన తర్వాత తాను ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. గాంధీజీ ద్వారా భారతదేశాన్ని గుర్తించాలని అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా 1982లో ‘గాంధీ’ పేరుతో ఓ చిత్రం వచ్చింది. దీనికి రిచర్డ్ అటెన్బరో దర్శకత్వం వహించారు.
మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. దేవుడు ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు బుధవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ‘గెట్ వెల్ సూన్’ అంటూ మోదీతో కూడిన ఓ చిత్రాన్ని కూడా షేర్ చేసింది. గాంధీ వారసత్వాన్ని మోదీ నాశనం చేస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. మహాత్మాగాంధీ గురించి ప్రపంచానికి తెలియదని చెబుతున్న త్వరలో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్న మోదీ.. ఆయన ఏ ప్రపంచంలో బతుకుతున్నారో తనకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్లలో గాంధీ పేరుతో ఉన్న సంస్థలను బీజేపీ సర్కారే నాశనం చేసిందని ఆరోపించారు. గాంధీని హత్య చేసిన గాడ్సే సైద్ధాంతిక వారసులు మహాత్మాగాంధీ చూపిన సత్యమార్గాన్ని అనుసరించలేరని అన్నారు. దేశానికి మోదీ లాంటి వ్యక్తి ప్రధాని కావడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ విమర్శించారు.