హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): 2022లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరిగే నాటికి ప్రతి ఒక్కరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రధాని మోదీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలో రోడ్ల పక్కనున్న గుడిసెల సంగతేంటో సెలవివ్వాలని తెలంగాణ రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. వారణాసిలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయన వరుసగా వీడియో ఆధారాలను బయటపెడుతూ.. ప్రధానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. గురువారం గంగానదిలోకి డ్రైనేజీ నీటిని వదులుతున్న దృశ్యాలను విడుదల చేసిన ఆయన.. రూ.2,400 కోట్లతో చేపట్టిన గంగాప్రక్షాళన ఇదేనా? అని ప్రశ్నించారు. తాజాగా శుక్రవారం మరో వీడియోను సోషల్మీడియాలో ఆయన పోస్టు చేశారు.
‘మోదీజీ.. మీ సొంత నియోజకవర్గం వారణాసిలో రోడ్లపక్కనున్న ఈ పూరి గుడిసెల సంగతేంటి? ప్రధాని హోదాలో మీరు వారణాసికి వచ్చినప్పుడల్లా ఈ బ్రిడ్జి పైనుంచే ప్రయాణిస్తారు. వచ్చేటప్పుడో, వెళ్లేటప్పుడో బ్రిడ్జి పక్కన ఈ గుడిసెలు మీకు కనిపించలేదా?’ అని ఆయన ప్రశ్నించారు. 2022 నాటికి దేశంలో అందరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రధాని మోదీ ప్రసంగం క్లిప్పింగ్కు, ‘క్యా హుహ తేరా వాదా?’ అనే బాలీవుడ్ గీతాన్ని బ్యాక్గ్రౌండ్లో చేర్చి సోషల్ మీడియాలో క్రిశాంక్ పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది. వారణాసికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనున్న గుడిసెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోతో వేలాడుతున్న ఫ్లెక్సీతోపాటు వారణాసిలో రోడ్పై ప్రవహిస్తున్న మురి నీటి ఫొటో ను కూడా ఈ వీడియోలో పొందుపర్చారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యలు చేశారు. ‘ఇదేనా డబుల్ ఇంజిన్ సర్కార్’ అంటూ కొందరు ఎద్దేవా చేస్తే.. ‘డబుల్ డర్టీ సర్కార్’ అని మరికొందరు తమదైనశైలిలో విరుచుకుపడ్డారు.