న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. వరుసగా రెండువేలకుపైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కొవిడ్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత్లో కొవిడ్ పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై చర్చించనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ఫోర్త్వేవ్పై భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ పరిస్థితుల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్నాటక ప్రభుత్వాలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించాలని చెప్పారు. ఇదిలా ఉండగా.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,483 కొవిడ్ కేసులున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,636కు పెరిగాయి. మరో వైపు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పిల్లలకు సంబంధించిన మూడు టీకాలకు అత్యవసర వినియోగ అధికారం ఇచ్చింది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్, బయోలాజికల్-ఈ కార్బెవాక్స్, జైడస్ క్యాడిలా జైకోవ్-డీ 12 టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసింది. దీంతో వ్యాక్సినేషన్ మరింత వేగవంతంకానున్నది.