న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లో రూ 17,500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హల్ద్వానీలో ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేశారు. ఈ ప్రాజెక్టులతో హల్ద్వానీ ప్రజలకు ఇతర ప్రాంతాలతో మెరుగైన కనెక్టివిటీతో పాటు ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగవుతాయని మోదీ అన్నారు.
నీరు, సీవేజ్, రోడ్లు, పార్కింగ్, వీధి దీపాల వంటి మౌలిక వసతుల అభివృద్ధికి రూ 2000 కోట్లతో పధకాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఉత్తరాఖండ్లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రధాని ప్రసంగం సాగింది. రాష్ట్ర ప్రజలు తమ శక్తి సామర్ధ్యాలతో ఈ దశాబ్ధాన్ని ఉత్తరాఖండ్ దశాబ్ధంగా మలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. చార్ధాం మెగా ప్రాజెక్టు, నూతన రైల్వే రూట్లతో ఈ స్వప్నం సాకారమవుతుందని అన్నారు.
గత పాలకులు ఉత్తరాఖండ్ అభివృద్ధిని విస్మరించారని విమర్శలు గుప్పించారు. అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా ప్రధాని మోదీ హల్ద్వానీలో ఎయిమ్స్కు శంకుస్ధాపన చేశారు. ఉధం సింగ్ నగర్లో ఎయిమ్స్ రిషీకేష్ శాటిలైట్ సెంటర్, పిథోరగఢ్లో జగ్జీవన్ రాం ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్ధాప చేశారు. ఈ రెండు ఆస్పత్రులను దాదాపు రూ వేయి కోట్లతో నిర్మించనున్నారు.