Adani | అహ్మదాబాద్: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో భారీ అవినీతి బయటపడింది. కరెంట్ కొనుగోలులో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు అదానీ కంపెనీకి అనుచిత లబ్ధి చేకూర్చినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. రెండు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల కింద, ఐదేండ్లలో అదానీ పవర్ ముంద్రా లిమిటెడ్ (ఏపీఎంయూఎల్)కు గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (జీయూవీఎన్ఎల్) రూ.3,900 కోట్లు అదనంగా చెల్లించినట్టు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. తాను చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తూ అదనంగా చెల్లించిన భారీ మొత్తాన్ని అదానీ కంపెనీల నుంచి రికవరీ చేసేందుకు ప్రభుత్వ సంస్థ జీయూవీఎన్ఎల్ రాసిన లేఖను ఆయన బయటపెట్టారు.
అసలేం జరిగిందంటే…
అక్టోబర్ 2018 – మార్చి 2023 వరకు విద్యుత్తు సరఫరా చేసేందుకు అదానీ పవర్తో జీయూవీఎన్ఎల్ రెండు ఒప్పందాలను చేసుకున్నది. వీటి ప్రకారం ఐదేండ్ల కాలానికి రూ.13,802 కోట్లు అదానీ కంపెనీకి గుజరాత్ ప్రభుత్వం చెల్లించింది. అయితే విద్యుత్తు ఉత్పత్తికి బొగ్గు కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఇన్వాయిస్లు ఏపీఎంయూఎల్ ప్రభుత్వానికి సమర్పించలేదు. బొగ్గు ఎంత ధరకు కొన్నారనేది తెలియజేయలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.13,802 కోట్లను ఆ కంపెనీకి చెల్లించేసింది. కాగా, అదానీకి చెందిన పలు కంపెనీలు అవినీతికి పాల్పడ్డాయని హిండెన్బర్గ్ నివేదికలో పేర్కొనడంతో గుజరాత్ ప్రభుత్వం మేల్కొన్నది. జీయూవీఎన్ఎల్ 2023 మే 15న అదానీ పవర్ కంపెనీకి లేఖ రాసింది. అదనంగా చెల్లించిన రూ.3,802 కోట్లను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని అందులో పేర్కొన్నది.
అధిక ధరలకు బొగ్గు కొని…
కొన్ని ఎంపిక చేసిన కంపెనీల నుంచి అదానీ కంపెనీ మార్కెట్ రేటు కంటే అధిక ధరలు చెల్లించి బొగ్గు కొనుగోలు చేసినట్టు హిండెన్బర్గ్ నివేదిక బహిర్గతం చేసింది. ఇండోనేషియా మార్కెట్ రేట్లను ఈ ధరలు ప్రతిబింబించడం లేదని నివేదికలో పేర్కొన్నది.
చెల్లింపులు తాత్కాలికమే…
ప్రతిపక్షాల ఆరోపణలపై రాష్ట్ర మంత్రి రుషికేశ్ పటేల్ స్పందించారు. ‘అదానీ పవర్, జీయూవీఎన్ఎల్ మధ్య రాజీ కోసం ధరలను నిర్ణయించాలని కోరుతూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ)ని ఆశ్రయించాం. ఏపీఎంయూఎల్కి చేసిన చెల్లింపులు తాత్కాలికమే’ అని పేర్కొన్నారు.
ఈడీ ఎక్కడ.. సీబీఐ ఏదీ?
అధిక ధరల చెల్లింపులపై ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. మంత్రి, అధికారులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లో వెంటనే వాలిపోయే ఈడీ ఎక్కడ?.. సీబీఐ ఏదీ?. దీంతో సంబంధం ఉన్న మంత్రి, అధికారులపై చర్యలు చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు.