న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేశారు. ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ఏయే అంశాలపై పోరాటం చేయాలన్న జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో మోదీ మాట్లాడారు. మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అడ్డుకున్నారు. దీంతో అధిర్ రంజన్పై మోదీ సెటైర్ వేశారు. కొందరు ఇంకా 2014లోనే ఉన్నారని అధిర్ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. 1972లో చివరిసారిగా బెంగాల్లో కాంగ్రెస్ గెలిచిందంటూ అధిర్కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చినా కూడా అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వలేదు. ఎన్ని ఓటములు ఎదురైనా కాంగ్రెస్ నేతల తీరు మాత్రం మారడం లేదని ధ్వజమెత్తారు. వందేండ్ల వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదు అని మోదీ స్పష్టం చేశారు.
గత రెండేండ్లుగా కరోనా మహమ్మారితో భారత్ పోరాడుతోంది. కొవిడ్ను కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు. కరోనా కష్టకాలం నుంచి త్వరగా బయటపడాలి. కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చామన్నారు. పూర్తి సంకల్పంతో దేశం మరింత ముందుకెళ్లాలి. పేదల ఇండ్ల నిర్మాణం మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించామని గుర్తు చేశారు. గ్యాస్ కనెక్షన్ ఇచ్చి పేద మహిళల బాధలు తొలగించామన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా తయారైందన్నారు. ఎగుమతులు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ప్రపంచంలో భారత్ లీడర్గా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.