హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ‘లెమన్ గ్రీన్’ రెస్టారెంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి మృతుని కుటుంబానికి PMNRF పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తామన్నారు.
కాగా, బధవారం ఉదయం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 21 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ఢిల్లీ, మాల్వియ నగర్లోని లెమన్ గ్రీన్ అనే రెస్టారెంట్లో ఉదయం 9.45 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. రెస్టారెంట్ బేస్మెంట్లో మొదలైన మంటలు తర్వాత పై అంతస్తుల వరకు వ్యాపించాయి.
ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది మరణించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సిబ్బంది శ్రమించి పలువురిని రక్షించారు. అందులో అగ్నిప్రమాదం మొదలైన బేస్మెంట్లో చిక్కుకున్న పలువురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.