PM Modi : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాజధాని లక్నో (Luknow) లో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అలీగంజ్ (Aliganj) లోని పురానియా ప్రాంతంలో ఉన్న ఓ మూడు అంతస్తుల భవనంలోని కోచింగ్ సెంటర్ (Coaching Centre) లో చెలరేగిన మంటల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
వివరాల్లోకి వెళ్తే.. పురానియాలోని ఓ వాణిజ్య భవనంలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం మొత్తాన్ని చుట్టుముట్టడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం పై అంతస్తుల నుంచి కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా 20 నుంచి 24 ఏళ్లలోపు వయసు వారేనని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాద వార్త తెలియగానే ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరోవైపు అలీగఢ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని లక్నోకు తిరిగి వచ్చారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇతర బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
భవనం గోడలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించారు. ప్రమాదానికిగల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.