న్యూఢిల్లీ: మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసిన పుస్తకం అంశంలో భయపడడం వల్లే ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభకు రావడం లేదని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ఆ తీర్మారాన్ని సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఎంపీల వల్ల ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఎవరైనా మోదిని బెదిరిస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ గాంధీ అన్నారు. గడిచిన గురువారం కొందరు మహిళా ఎంపీలు లోక్సభలో ఆందోళన చేపట్టడం వల్ల ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
అమెరికా వాణిజ్య ఒప్పందం అంశంలో భయపడుతున్న ప్రభుత్వం.. బడ్జెట్లో చర్చ చేపట్టేందుకు వణుకుతోందని ఇవాళ రాహుల్ విమర్శించారు. ఆ వాణిజ్య ఒప్పందం కుదిరిన తీరు, దాని వల్ల రైతులకు ఎదురుకానున్న సమస్యలను చెప్పేందుకు ప్రభుత్వం జంకుతోందన్నారు. ప్రధాని మోదీని బెదిరించేందుకు సభ్యులు ప్లాన్ చేశారన్న ఊహాగానాలు చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయని, అలాంటి అంశం ఏమీ లేదని, సభ్యుల వల్ల కాదు.. తాను చెప్పబోయే నిజాన్ని తట్టుకోలేక, భయంతో ప్రధాని సభకు రావడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
కాంగ్రెస్ సభ్యులు ప్రధానిని అటాక్ చేసే ప్రశ్నే లేదని, ఆయన ధైర్యంగా సభకు రావాలని, ఎవరైనా దాడి చేస్తారన్న సమాచారం ఉంటే, ఆ వ్యక్తిని అరెస్టు చేయాలని, మీరెందుకు అలా చేయడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసిన పుస్తకం పట్ల మోదీకి భయం ఉన్నట్లు తెలిపారు. నరవాణే పుస్తకాన్ని పబ్లిష్ చేయలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ అన్నారని, కానీ తమ వద్ద ఆ బుక్ కాపీ ఉన్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు.