చండీగఢ్, జనవరి 6: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన రద్దు కావడానికి భద్రతా వైఫల్యమే కారణమన్న ఆరోపణలను ఆ రాష్ట్ర సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మరోసారి కొట్టిపారేశారు. ప్రధాని ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో సభను రద్దు చేసుకొన్నట్టు ప్రకటించడం ‘మోదీ గిమ్మిక్’గా అభివర్ణించారు. పంజాబ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూల్చడానికే బీజేపీ ఈ కుట్రకు పాల్పడినట్టు మండిపడ్డారు. పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించడానికి ప్రధాని, ఆయన కోటరీ యత్నిస్తున్నదని మండిపడ్డారు. ప్రధాని వంటి గౌరవమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి చౌకబారు నాటకాలు ఆడటం సహేతుకం కాదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం హోషియార్పుర్లోని ఓ మార్కెట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చన్నీ మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదు. ఆ కారణంగా వాళ్లు ఫిరోజ్పూర్ ర్యాలీని రద్దు చేసుకోలేదు. నిజానికి ఆ సభకు కేవలం 700 మంది జనం వచ్చారు. వేసిన కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ విషయం తెలిసే ప్రధాని పర్యటనను రద్దు చేసుకొని ఢిల్లీకి వెనుదిరిగారు. అయితే, అసలు విషయాన్ని దాచిపెట్టి ‘భద్రతా వైఫల్యం’తోనే పర్యటనను రద్దు చేసుకొన్నట్టు ఓ పనికిమాలిన కారణాన్ని చెబుతున్నారు. పంజాబ్ ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడానికి ఇలాంటి కుట్ర పన్నారు’ అని చన్నీ నిప్పులు చెరిగారు. జమ్ముకశ్మీర్లో చేసినట్టుగానే పంజాబ్లో కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని నిర్ణయించుకొన్నారని మండిపడ్డారు. నిరసనకారులు ప్రధాని కాన్వాయ్కి కిలోమీటర్ దూరంలో ఉంటే ఆయన ప్రాణాలు అపాయంలో ఎలా ఉంటాయని ప్రశ్నించారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటం కోసం పంజాబీలు తమ ప్రాణాలనే త్యాగం చేశారని, అలాంటి వాళ్లు ప్రధానికి ఎలా ముప్పు తలపెడతారని ప్రశ్నించారు.
కేంద్రం త్రిసభ్య కమిటీ
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తు చేయడానికి కేంద్రప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. క్యాబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శి (భద్రత) సుధీర్ కుమార్ సక్సేనా నేతృత్వంలోని ఈ కమిటీలో ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, ఎస్పీజీ ఐజీ ఎస్ సురేశ్ సభ్యులుగా ఉన్నారు.
భద్రతా వైఫల్యం.. రాజకీయ ఫుట్బాల్ కాదు
మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తిందన్న ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ స్పందించారు. దీన్నో సున్నితమైన అంశంగా పరిగణించాలని సూచించారు. భద్రతా వైఫల్యం అనేది రాజకీయ ఫుట్బాల్ లాంటిది కాదన్నారు.
మీడియా దృష్టిని మరల్చడానికే: సిద్ధు
ప్రధాని పంజాబ్ పర్యటన రద్దు కావడానికి భద్రతా వైఫల్యమనడం ఓ పెద్ద డ్రామా అని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్జోత్సింగ్ సిద్ధూ అభివర్ణించారు. ఖాళీ కుర్చీలు ఉన్న సభలో ప్రసంగించడం ఇష్టంలేకనే ప్రధాని ఈ నాటకం ఆడారని దుయ్యబట్టారు. సభకు జనం రాలేదన్న వార్తలు మీడియాలో రావొద్దన్న ఉద్దేశంతో వారి దృష్టిని మరల్చేందుకు భద్రతా వైఫల్యం అనే కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ‘నిరసనకారులు అడ్డుకొన్నారన్న నెపంతో.. కేవలం 15 నిమిషాలు కూడా ఆగకుండా ప్రధాని వెనుదిరిగారు. అయితే సాగుచట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఏడాదికి పైగా ఉద్యమం చేపట్టారు’ అని గుర్తుచేశారు.