న్యూఢిల్లీ, మే 24: ఢిల్లీ మద్యం పాలసీ కేసు పూర్తిగా ఫేక్ అనే విషయాన్ని ప్రధాని మోదీనే అంగీకరించారని, ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన వాళ్లు త్వరలో బయటకు వస్తారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో వర్చువల్గా మాట్లాడుతూ మోదీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో “కేజ్రీవాల్ ఒక ‘అనుభవం ఉన్న దొంగ’. ఈ కేసులో ఒక్క ఆధారం కూడా లభ్యం కాలేదు” అంటూ పేర్కొన్నారని కేజ్రీవాల్ తెలిపారు.
తన తప్పుడు అరెస్టును కప్పిపుచ్చేందుకు మోదీ తనను ఉద్దేశించి ఆ విధమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో తనతోపాటు చాలా మందిని అరెస్టు చేశారని, దేశవ్యాప్తంగా 500కుపైగా ప్రాంతాల్లో సోదాలు చేశారని, అయినా బీజేపీ నేతలు చెబుతున్న స్కామ్లో ఒక్క రూపాయి కూడా అక్రమ సొమ్మును గుర్తించలేదన్నారు. బీజేపీలో వారసత్వ పోరు తీవ్రంగా ఉన్నదని, తన వారసుడిగా, తన తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు హోంమంత్రి అమిత్షాకు మోదీ మార్గం సుగమం చేస్తున్నారని చెప్పారు.