PM Modi : ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అందె శ్రీ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేనిలోటు అని అభివర్ణించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం సంతాప సందేశాన్ని విడుదల చేసింది. అందె శ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయని ప్రధాని తన సందేశంలో కొనియాడారు.
‘అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు, అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకంచేసే శక్తి, ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి.
అందె శ్రీ తన సామాజిక స్పృహను సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయమని ప్రధాని కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. చివరగా ‘ఓం శాంతి’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.