Nitish Kumar | జేడీయూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవహారశైలి దేశరాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న నితీశ్ కుమార్ (Nitish Kumar).. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్కు డుమ్మా కొట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ (Niti Aayog) మీటింగ్ జరుగుతోంది. ఇవాళ ఉదయం ప్రారంభమైన 9వ పాలక మండలి భేటీలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఒక్కరే ఈ సమావేశానికి హాజరయ్యారు. మిగతా రాష్ట్రాల సీఎంలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తమ రాష్ట్రాలపై వివక్ష చూపారంటూ నీతి ఆయోగ్ మీటింగ్ను బాయ్కాట్ చేశారు.
అయితే, వికసిత్ భారత్ -2047 అజెండాగా సాగుతున్న ఈ భేటీకి ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నితీశ్ కుమార్ గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఈ భేటీకి బీహార్ తరఫున డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. అయితే, మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక భేటీకి సీఎం నితీశ్ హాజరుకాకపోవడంపై దేశ రాజకీయాల్లో అప్పుడే చర్చ మొదలైంది. బీహార్కు కేంద్రం ప్రత్యేక హోదా కల్పించకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు. తమ డిమాండ్ను తిరస్కరించడానికి నిరసనగా.. సీఎం నితీశ్ కీలక భేటీని బాయ్కాట్ చేసినట్లుగా తెలుస్తోంది.
నీతి ఆయోగ్ మీటింగ్ నుంచి వాకౌట్ చేసిన పశ్చిమబెంగాల్ సీఎం
ఈ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. ఈ సమావేశంలో బెంగాల్కు కేంద్ర నిధులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావించగా.. తన మైక్ను మ్యూట్ (mic was muted) చేసినట్లు దీదీ ఆరోపించారు. ఐదు నిమిషాలకు మించి మాట్లాడేందుకు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే భేటీ నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. ‘నాకు ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు అనుమతించారు. పశ్చిమ బెంగాల్కు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని సమావేశంలో ప్రస్తావించాను. అంతే నామైక్ను మ్యూట్ చేసేశారు. నాకంటే ముందు చాలా మంది మాట్లాడారు. వారికి 20 నిమిషాలు సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఇచ్చారు. నాకు మాత్రం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు అనుమతించారు. ఇందుకు నిరసనగా నేను సమావేశం నుంచి బయటకు వచ్చేశాను. విపక్షాల నుంచి నేను ఒక్కదాన్నే ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ నన్ను మాట్లాడనివ్వకపోవడం అవమానకరం’ అని సమావేశం నుంచి బయటకు వచ్చిన అనంతరం దీదీ విలేకరులతో అన్నారు.
విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు
ఇక ఈ భేటీని విపక్ష పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు బాయ్కాట్ చేశారు (Opposition chief ministers skip). ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపిందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా దక్షిణాది రాష్ర్టాలపై మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని పలువురు సీఎంలు బహిష్కరించారు. వీరిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ప్రదేశ్ సీఎంలు ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, భగవంత్ మాన్, సుఖ్విందర్ సింగ్ సుఖు ఉన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కూడా భేటీకి గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తాను నీతి ఆయోగ్ భేటీకి హాజరు కాలేనని కేరళ సీఎం విజయన్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Also Read..
Mamata Banerjee | మైక్ కట్.. నీతి ఆయోగ్ మీటింగ్ నుంచి వాకౌట్ చేసిన పశ్చిమబెంగాల్ సీఎం
NITI Aayog | ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ ప్రారంభం.. పలు రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు.. విధ్వంసానికి ఐఎస్ఐ కుట్ర