కేంద్ర ప్రభుత్వ విధానంపై పీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. కోవిడ్ నిబంధనల పేరుతో తమ యువ సమ్మేళనాన్ని జరుపుకోడానికి అనుమతినివ్వడంలేదని ఆరోపించారు. యూపీలో జరగబోయే ప్రధాని మోదీ ర్యాలీలకు మాత్రం అనుమతులిస్తారని ఎద్దేవా చేశారు. కేవలం తాము జరుపుకునే సమావేశాల ద్వారానే కోవిడ్ వ్యాప్తి జరుగుతుందా? అని విలేకరుల సమావేశంలో నిలదీశారు. పార్టీ అధ్యక్షురాలు ముఫ్తీ ఇంట్లో ఓ యువ సమ్మేళనాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమ్మేళనం కోసం వచ్చే యువకులను పోలీసులు అడ్డుకుంటున్నారని, అటు వైపుగా వెళ్లే దారులన్నింటినీ మూసేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.
కోవిడ్ వ్యాప్తి సాకుతో తమ సమావేశాలకు అనుమతులివ్వడం లేదని మెహబూబా తీవ్రంగా ఫైర్ అయ్యారు. ”తాము యువకుల సమ్మేళనం నిర్వహించుకుంటామంటే జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం మాకు అనుమతులివ్వడం లేదు. కోవిడ్ నిబంధనలు మాకే వర్తిస్తాయా? ఇతర పార్టీలకు వర్తించవా? మా సమ్మేళనానికి వచ్చే యువకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. కొడుతున్నారు” అంటూ మెహబూబా తీవ్రంగా మండిపడ్డారు.