ఢిల్లీ : దేశాన్ని లాక్డౌన్ నుంచి కాపాడాలని.. లాక్డౌన్ను రాష్ట్రాలు చివరి అస్త్రంగానే పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో సమావేశం పూర్తి అనంతరం దేశంలో కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. రెండో దశలో కరోనా తుఫాన్ వలె విరుచుకుపడుతుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఉధృతంగా ఉందని తెలిపారు. వైద్య సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపిన మోదీ మనందరం కలిసి ఈ పరీక్షను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకూడదన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ఈ దిశగా పనిచేస్తుందని వెల్లడించారు.
రెండో దశలో కరోనా మరింత తీవ్రంగా సవాల్ విసురుతోందన్న ప్రధాని కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ధైర్యంగా ఉంటే కఠిన పరిస్థితులను ఎదుర్కోగలమన్నారు. ధైర్యం, క్రమశిక్షణతోనే మనం విజయం సాధించగలమన్నారు. మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును చక్కదిద్దుతాయన్నారు.
అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆక్సీజన్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన్ ప్రత్యేక రైలు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీరుస్తోందన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మెడిసిన్ ఉత్ప్తత్తి సంస్థలు భారత్లో ఉన్నట్లు తెలిపిన ప్రధాని ఫార్మా కంపెనీలు ఈ మేరకు ఔషధ ఉత్పత్తిని పెంచాయన్నారు. కరోనా రెండో దశలో ఔషధాల కొరత లేదన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేస్తున్న దేశంగా భారత్ నిలిచిందన్నారు.
ఫ్రంట్లైన్ వారియర్స్కు, వయోవృద్ధులకు టీకాలు వేసినట్లు మోదీ తెలిపారు. 45 ఏండ్ల పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. కాగా మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి కూడా టీకాలు వేయనున్నట్లు వెల్లడించారు. నగరాల్లో పనిచేస్తున్న వారిలో 18 ఏళ్లు పైబడిన వారే అధికమని వారికి టీకాలు వేస్తే నగరాల్లో సత్ఫలితాలు వస్తాయన్నారు.
అందరం కలిసి కరోనాపై పోరాడాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కరోనాపై పోరులో భాగస్వామ్యమయ్యాయి. ప్రజల సహకారంతోనే కరోనాపై విజయం సాధించగలమని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే వైద్య సదుపాయాల్లో చాలా మెరుగ్గా ఉన్నామన్నారు. మహమ్మారిపై మరోసారి భీకర యుద్ధం చేస్తున్నట్లు తెలిపారు. యువకులు గ్రూపులుగా ఏర్పడి కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చొరవ తీసుకోవాలని.. దీనివల్ల కంటైన్మెంట్ జోన్స్, లాక్డౌన్లు పెట్టాల్సిన అవసరం రాదని ప్రధాని పేర్కొన్నారు.