న్యూఢిల్లీ, జనవరి 21: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని నెలకొల్పనున్నట్టు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన తెగువను ఈ విగ్రహం స్ఫురణకు తెస్తుందని అన్నారు. గ్రానైట్తో నిర్మించనున్న ఈ విగ్రహం పూర్తయ్యే వరకు.. ఆ స్థానంలో హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు వెల్లడించారు. దీన్ని నేతాజీ జయంతి రోజైన ఈనెల 23న ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. గ్రానైట్ విగ్రహం 28 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో ఉండబోతున్నట్టు సమాచారం. రిపబ్లిక్డే పరేడ్ కోసం బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన నేతాజీ శకటానికి కేంద్రం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే నేతాజీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిందని బెంగాల్ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. నేతాజీ మరణానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేసినప్పుడే ఆయనకు అసలైన నివాళి అర్పించినట్టు అవుతుందని స్పష్టంచేసింది.