న్యూఢిల్లీ: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. ‘భారత రత్న, లతా జీ సాధించిన విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘దేశంలో పూరించలేని శూన్యత మిగిల్చారు. భారత అభివృద్ధిని లతాజీ ఆకాంక్షించారు. సుస్థిరమైన, అభివృద్ధి చెందిన భారత్ను లతా మంగేష్కర్ కోరుకున్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిది. ఆమె స్వరం అజరామరం’ అని ప్రధాని మోదీ ట్విటర్లో పోస్టు చేశారు.
గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె స్వరం అజరామరమని, అభిమానుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని తెలిపారు. ఎన్నో దశాబ్దాల పాటు ఆమె గొంతుక నిలిచిపోతుంది.
గాన కోకిల లతా మంగేష్కర్ మృతి దేశానికి తీరని లోటని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. ఎన్నో తరాల పాటు ఆమె పాటలు గుర్తుండిపోతాయన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
కాగా, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని అధికార వర్గాలు తెలిపాయి.