పట్నా, మే 25: ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ‘ముజ్రా’(నృత్యం) చేస్తుందని, బానిసత్వం ప్రదర్శిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను దోచేసి ముస్లింలకు మళ్లించేందుకు ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు.
శనివారం బిహార్లోని పట్లిపుత్ర, కరాకట్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొన్నారు. ‘ఓట్ జిహాద్’కు పాల్పడున్న వారి మద్దతుపై ఇండియా కూటమి ఆధారపడిందని ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమి గెలిస్తే ముస్లింలకు రిజర్వేషన్లు మళ్లించేందుకు కోర్టులు కూడా జోక్యం చేసుకోకుండా రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు.
ప్రధాని మోదీ చేసిన ‘ముజ్రా’ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా తీవ్రంగా స్పందించారు. ‘మచిలీ(చేపలు), మటన్, మంగళసూత్రాల తర్వాత ఇప్పుడు ముజ్రా వంతు వచ్చింది. దేశ ప్రధాని ఇలాంటి భాష మాట్లాడటం తగునా ? ప్రధాని మోదీకి చెందిన కులం లాంటిదే ముస్లింలలోనూ ఉంది. వారు గుజరాత్లో రిజర్వేషన్లు పొందుతున్నారు.’ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలను ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ కూడా ఖండించాయి.