వారణాసి: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్ను సోమవారం ప్రారంభించిన ప్రధాని మోదీ, దాని నిర్మాణంలో భాగమైన కార్మికులతో కలిసి భోజనం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. చారిత్రక కాశీ విశ్వనాథ దేవాలయం వద్ద ఐకానిక్ దశాశ్వమేధ ఘాట్ సమీపంలో రూ.339 కోట్ల వ్యయంతో నిర్మించిన కాశీ కారిడార్ తొలి ఫేజ్ను మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని కొంతసేపు భోజ్పురి భాషలో కూడా మాట్లాడారు. కొత్త భారతదేశం దాని సంస్కృతి గురించి గర్విస్తోందని, దాని సామర్థ్యంపై కూడా విశ్వాసం ఉందని అన్నారు. నవ భారతదేశంలో ‘విరాసత్’ మరియు ‘వికాస్’ ఉన్నాయన్నారు.