న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పీజీ సీట్లను భర్తీ చేయకపోవడంపై మండిపడింది. డాక్టర్ల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని విమర్శించింది. దేశంలో ఓ వైపు వైద్య నిఫుణుల కొరత ఉంది. మరోవైపు పీజీ సీట్లు ఖాళీగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఈ సంవత్సారానికి సంబంధించిన చివరి విడత నీట్ పీజీ సీట్ల భర్తీ మే 7తో ముగిసింది. అయితే ఇంకా 1,456 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా వీటిని భర్తీ చేయాలని కోరుతూ ఏడుగురు డాక్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంఆర్ షా, అనిరుద్ధ బోస్ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా మంది డాక్టర్లు, సూపర్ స్పెషలిస్ట్ల అవసరం ఉన్నప్పుడు పీజీ సీట్లను ఖాళీగా ఉంచి ఏం చేస్తారు? ఈ విషయంలో ఏమైనా బాధ్యత ఉందా? ప్రతిసారి కోర్టు జోక్యం చేసుకోవాలా? కోర్టు ఆర్డర్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా ఖాళీ సీట్లను ఎందుకు భర్తీ చేయరు? అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
డాక్లర్ల భవిష్యత్తుతోపాటు వారి కొరతపై ఆటలాడుకుంటున్నారని కేంద్రానికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న నీట్- పీజీ సీట్లను భర్తీ చేయాలని ఆదేశించింది. దీనిపై అఫిడవిడ్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ)ని ఆదేశించింది. వైద్య విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకపోతే వారి జీవితాలు, భవిష్యత్తుతో ఆడుకున్నందుకు పరిహారం చెల్లించాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది.