న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులపై తోటి ప్రయాణికుల మూత్ర విసర్జన సంఘటనలపై ఎయిర్ ఇండియా మేల్కొంది. ఒక పైలట్, నలుగురు సిబ్బందిపై చర్యలు చేపట్టింది. వారికి షోకాజ్ నోటీస్ జారీ చేయడంతోపాటు విధులకు దూరంగా ఉంచి గ్రౌండ్ చేసింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న మిగతా సిబ్బందిపై అంతర్గత దర్యాప్తు జరుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ‘నలుగురు క్యాబిన్ సిబ్బంది, ఒక పైలట్కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. విచారణ పెండింగ్లో ఉండటంతో వారిని డీ రోస్టర్ చేశాం. విమానంలో మద్యం సేవించడం, సంఘటనల మేనేజ్మెంట్, ఫిర్యాదుల నిర్వాహణ, నమోదుతోపాటు సిబ్బంది వల్ల ఇతర లోపాలు ఉన్నాయా అనే దానిపై అంతర్గత దర్యాప్తులు కొనసాగుతున్నాయి’ అని ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) క్యాంప్బెల్ విల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. నివారించే వీలున్న సహ ప్రయాణికుల చర్యల వల్ల కస్టమర్లు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఎయిర్ ఇండియా తీవ్ర ఆందోళన చెందుతోందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.
కాగా, నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ముంబైకి చెందిన శంకర్ మిశ్రా మద్యం మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం అతడ్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు. అమెరికా ఆర్థిక సేవల సంస్థ కూడా శంకర్ మిశ్రాను ఉద్యోగం నుంచి తొలగించింది.