Vaishno Devi shrine | జమ్ములో ప్రసిద్ధ శ్రీ మాతా వైష్ణోదేవి దేవాలయానికి ఈ ఏడాది భారీగా భక్తులు పోటెత్తారు. సోమవారం కల్లా రికార్డు స్థాయిలో 93.50 లక్షల మంది భక్తులు వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీ మాతా వైష్ణోదేవి అమ్మవారిని ఇంత భారీగా భక్తులు దర్శించుకోవడం గత పదేండ్లలో ఇదే తొలిసారి అని వారు చెప్పారు. జమ్ములోని రియాసీ జిల్లా త్రికూట కొండల్లో గల వైష్ణోదేవి దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 25 వరకు వైష్ణోదేవి అమ్మవారిని 93.50 లక్షల మంది దర్శించుకున్నారని చెప్పారు. సరిగ్గా పదేండ్ల క్రితం 2013లో 93.23 లక్షల మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. అంతకుముందు 2011లో 1,01,15,647 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే, 2012లో 1,04,09,569 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఇప్పుడు ప్రతి రోజూ 37-44 వేల మంది భక్తులు పుణ్య క్షేత్రానికి వచ్చి వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకుంటున్నారని దేవస్థానం బోర్డు సీఈఓ అన్షుల్ గార్గ్ చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రతి రోజూ వచ్చే భక్తుల సంఖ్య 50 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 95 లక్షలు దాటుతుందని భావిస్తున్నారు. ఈ దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం.. మాతా వైష్ణోదేవి భవన్, దుర్గా భవన్లో స్కై వాక్ తదితర సౌకర్యాలు కల్పించారు. స్కైవాక్ తోపాటు ఆధునీకరించిన పార్వతి భవన్ను గత అక్టోబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కాట్రాలోని ఈ పుణ్య క్షేత్రంలో 24 గంటలూ పని చేసే మోడర్న్ కాల్ సెంటర్ కూడా ఉంది. గత అక్టోబర్లో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భక్తుల సౌకర్యార్థం ‘లైవ్ దర్శన్’ ప్రారంభించారు.