తిరువనంతపురం: మరణించిన వృద్ధురాలి మృతదేహం వద్ద నవ్వుతూ కుటుంబ సభ్యులు ఫొటో దిగారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే నెటిజన్లు భిన్నంగా స్పందించారు. చాలా మంది ఆ కుటుంబ సభ్యుల తీరును తప్పుపట్టగా, కొందరు సమర్థించారు. అయితే మరణించిన వారికి సంతోషంగా వీడ్కోలు చెప్పడమే తమ ఉద్దేశమని ఆ కుటుంబ సభ్యులు వివరించారు. కేరళలోని పాతనంతిట్ట జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మల్లేపల్లి గ్రామానికి చెందిన 95 ఏళ్ల మరియమ్మ, వయసు వల్ల వచ్చే అనారోగ్యం వల్ల ఏడాదిగా మంచానికే పరిమితమైంది. ఈ నెల 17న ఆమె మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం మరియమ్మ శవపేటిక వద్ద అంతా కలిసి నవ్వుతూ గ్రూప్ ఫొటో దిగారు. ఆమెకు 9 మంది సంతానం కాగా 19 మంది మనవళ్లు, ముని మనవళ్లు ఉన్నారు. చాలా మంది దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు.
కాగా, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చనిపోయిన వృద్ధురాలి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు అలా నవ్వుతూ ఫొటో దిగడంపై ఇంటర్నెట్లో పెద్ద చర్చ జరిగింది. కొందరు నెటిజన్లు ఆ కుటుంబం తీరును తప్పుపట్టారు. అయితే మరికొందరు సమర్థించారు.
ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు ఈ ఫొటోపై వివరణ ఇచ్చారు. మరియమ్మ 95 ఏళ్ల పాటు చాలా సంతోషంగా జీవించిందని, తన పిల్లలు, మనవళ్లను ఎంతగానో ప్రేమించిందని తెలిపారు. దీంతో ఆమెతో గడిపిన సంతోష క్షణాలు జీవితాంతం గుర్తుండేలా కుటుంబమంతా కలిసి ఇలా నవ్వుతూ ఫొటో దిగినట్లు చెప్పారు. అయితే ఈ ఫొటోను చూసి అంతా విమర్శిస్తున్నారే తప్ప అందులోని అసలు ఉద్దేశాన్ని కొందరు మాత్రమే గ్రహించారని అన్నారు. కాగా, విలపించే బదులు చనిపోయిన వారికి సంతోషంగా వీడ్కోలు చెప్పాలని మరొక కుటుంబ సభ్యుడు సూచించారు. తాము అదే చేశామన్నారు.
మరోవైపు కేరళ విద్యాశాఖ మంత్రి వీ శివన్కుట్టి కూడా ఈ ఫొటోపై ఫేస్బుక్లో స్పందించారు. ‘మరణం బాధాకరం. కానీ అది కూడా వీడ్కోలే. ఆనందంగా జీవించిన వారికి నవ్వుతూ వీడ్కోలు పలకడం కంటే సంతోషం ఏముంటుంది. ఈ ఫొటోకు నెగెటివ్ కామెంట్స్ అవసరం లేదు’ అని పేర్కొన్నారు.