తిరువనంతపురం, సెప్టెంబర్ 23: ఎన్ఐఏ సోదాలను నిరసిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) శుక్రవారం కేరళలో చేపట్టిన బంద్ హింసకు దారితీసింది. పలువురు పీఎఫ్ఐ సభ్యులు పలు బస్సులు, వాహనాలను, రోడ్డు పక్కన దుకాణాలను ధ్వంసం చేశారు. కన్నూరులో లారీలను ఆపి తాళం చెవులను ఎత్తుకెళ్లారు. కనిపించిన వాహనదారులు, లారీడ్రైవర్లపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కొల్లాంలోని పల్లిముక్కులో ఓ ఆందోళనకారుడు ఇద్దరు పోలీసులపై దాడి చేశాడు.
తిరువనంతపురం, కొల్లాం, కోజికోడ్, వయనాడ్, అలప్పుజాలో ఆర్టీసీ బస్సులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో పలువురు పౌరులు గాయపడ్డారు. పీఎఫ్ఐ చేపట్టిన బంద్ హింసాత్మకం కావటంతో 500 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 400 మందిని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అదుపులోకి తీసుకొన్నారు. ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేరళ హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించింది. హర్తాల్కు మద్దతివ్వని వారిపై దాడులు జరగకుండా, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.