న్యూఢిల్లీ, జూలై 9: రానున్న ఐదేండ్లలో దేశంలో పెట్రోల్ వినియోగం నిలిచిపోనున్నదని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచనప్రాయంగా చెప్పారు. శిలాజ ఇంధనాల వినియోగంపై నిషేధం ఉండొచ్చన్నారు. మహారాష్ట్రలోని ఓ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో మరో ఐదేండ్లలో పెట్రోల్ వాడకం ఉండదు. ఈ స్థానాన్ని పర్యావరణహిత ఇంధనాలు భర్తీ చేస్తాయి. బయో-ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్లాంటి ఇంధనాలే వాహనాలకు చోదకశక్తిగా మారుతాయి’ అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశానికి అన్నం పెడుతున్న రైతన్న, రేపు దేశాన్నే నడపాల్సి వస్తుందని, బయో-ఇథనాల్ తయారీకి రైతన్నే వెన్నుముక అన్నారు.చెరుకు నుంచి బయో-ఇథనాల్ ఉత్పత్తి జరుగడాన్ని దృష్టిలో ఉంచుకొని గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.