న్యూఢిల్లీ : త్వరలో జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాల్లో పెట్రోల్ పంపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు పంపుల నిర్మాణానికి దాబా యజమానులకు అనుమతులు జారీ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి దాబాల్లో పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయడం ద్వారా అటు యజమానులకు, ఇటు వాహనదారులకు ప్రయోజనాలుంటాయనే అంశంపై మాట్లాడారు.
జాతీయ రహదారుల వెంట పెట్రోల్ బంకులకు ఎన్ఓసీ ఇచ్చినట్లే.. చిన్న దాబా యజమానులకు పెట్రోల్ పంపులు, టెయిలెట్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. దేశంలోని హైవేలపై ఇంధన స్టేషన్ల నెట్వర్క్ను అనుసంధానించడంతో దాబా యజమానులకు అదనపు ఆదాయ వనరుగా మారుతుందన్నారు. అయితే ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్స్టేషన్ల ఏర్పాటుపై గడ్కరీ స్పందించలేదు. అయితే, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్ సౌకర్యాలకు పునాది వేయగలదని భావిస్తున్నారు.