న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఆయిల్ కంపెనీలు రోజుకు పెట్రోల్, డీజిల్పై దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచేస్తున్నాయి. మంగళవారం లీటర్ పెట్రోల్పై మరో 91 పైసలు, డీజిల్పై 87 పైసలు వడ్డించాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120కి చేరువైంది. తాజాగా పెరిగిన ధరలతో నగరంలో పెట్రోల్ ధర రూ.118.59 పెరగ్గా, డీజిల్ 104.62కి చేరింది. ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చి 22 నుంచి మొదలైన ఈ బాదుడు కొనసాగుతూనే ఉన్నది. గత 15 రోజుల వ్యవధిలో పెట్రో ధరలు పెరుగడం పదమూడోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై రూ.10.39, డీజిల్పై రూ.10.00 పెరిగింది.
మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో లీటర్ పెట్రోల్ దేశంలోనే అత్యధికంగా రూ.122.67 వద్ద ఉన్నది. తరువాతి స్థానంలో రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో రూ122.05గా ఉన్నది. డీజిల్ విషయానికి వస్తే.. ఆంధ్రపదేశ్లోని చిత్తూరులో లీటర్ రూ.106.84. ఇది దేశంలోనే ఎక్కువ.
ఇంధన ధరల పెంపుపై పార్లమెంట్ దద్దరిల్లింది. ధరల పెంపుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనలు చేశారు. లోక్సభ రెండు సార్లు వాయిదా పడింది. ధరలు పెంచే పనిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, దానిపై చర్చించేందుకు మాత్రం సిద్ధంగా లేదని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ధరల పెంపును సమర్థించుకుంటూ.. చిన్న విషయంగా చూపే ప్రయత్నం చేశారు. ఉక్రెయిన్లోని పరిస్థితులపై జరిగిన స్వల్ప చర్చ సందర్భంగా ఆయన లోక్సభలో మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్రోల్ ధరలు 50 శాతం వరకూ పెరుగ్గా, మన దేశంలో మాత్రం కేవలం 5 శాతమే పెరిగాయని చెప్పుకొచ్చారు.
పెట్రో ధరల పెంపునకు సంబంధించి మోదీ సర్కార్ తీరుపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఒక ‘కంపెనీ’లా మారిందని, తన లాభాలు తగ్గకుండా, పెరిగిన ఖర్చును ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నదన్నారు. ధరల పెరుగుదలతో దేశంలో ప్రజల జీవన వ్యయం కూడా పెరిగిపోయిందన్న వార్తా నివేదికను ట్విట్టర్లో షేర్ చేశారు. పెట్రో ధరలపై బీజేపీకి మిత్రపక్షమైన జేడీయూ నుంచి కూడా నిరసన సెగ ఎదురైంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి మాట్లాడుతూ పెంచిన ధరలను వెనక్కు తీసుకోవాలని, పెంపును తక్షణం ఆపేయాలని కోరారు. విపరీతంగా ధరలు పెరుగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.