న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి ముడిచమురు ధరలు పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్కు ధర దాదాపు 108 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో బల్క్ పెట్రోల్ ధర లీటర్ రూ.25 వరకు పెరిగే అవకాశం ఉన్నది. అలాగే త్వరలో సామాన్యులపై ధరల ప్రభావం సైతం పడనున్నది. ఇప్పటికే వంట నూనెల పెరుగుదలతో జనం ఇబ్బందులు పడుతుండగా.. చమురు ధరలు పెరిగే మరింత ధరలు పెరిగే ప్రమాదం ఉన్నది.
ఇప్పటికే బల్క్ డీజిల్ లీటర్పై రూ.25 పెరిగింది. మరో వైపు హోల్సేల్ వినియోగదారులకు విక్రయించే డీజిల్ ధర సైతం రూ.25 వరకు పెరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 40శాతం పెరిగిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పెట్రోల్ పంపుల ద్వారా విక్రయించే ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించలేదు.
ఈ నెలలో పెట్రోల్ పంపుల అమ్మకాలు 20 శాతం మేరకు పెరిగాయి. బస్ ఫ్లీట్ ఆపరేటర్లు, మాల్స్ తదితర బల్క్ వినియోగదారులు పెట్రోల్ పంపుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేశారు. సాధారణంగా అయితే పెట్రోలియం కంపెనీల నుంచి నేరుగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తారు. దీంతో ఇంధన రిటైలింగ్ కంపెనీల నష్టాలు పెరిగాయి.
నైరా ఎనర్జీ, జియో-బీపీ, షెల్ వంటి కంపెనీలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బంకులు నడుపడం అంత లాభదాయకం కాదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రికార్డు స్థాయిలో 136 రోజుల నుంచి ఇంధన ధరలు పెరుగలేదని, ప్రస్తుతం ఉన్న ధరలకు ఎక్కువ ఇంధనాన్ని విక్రయించే బదులు కంపెనీలు పెట్రోల్ పంపులను మూసివేయడమే మంచి నిర్ణయమని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి.
2008 సంవత్సరంలో అమ్మకాలు పడిపోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1,432 పెట్రోల్ పంపులను మూసివేసింది. నేటికీ అదే పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పెద్ద మొత్తంలో వినియోగదారులు పెట్రోల్ పంపుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో చిల్లర వ్యాపారుల నష్టాలు పెరుగుతున్నాయి. ముంబైలో బల్క్ వినియోగదారుల డీజిల్ ధర లీటర్కు రూ.122.05కి పెరిగింది. పెట్రోల్ పంపుల్లో లీటర్ డీజిల్ రూ.94.14కు విక్రయిస్తున్నారు.
అదేవిధంగా ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ ధర లీటరుకు రూ. 86.67 ఉండగా, హోల్సేల్, పారిశ్రామిక వర్గాలు లీటర్కు రూ.115 వరకు చెల్లించాల్సి వస్తున్నది. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీలు గతేడాది నవంబర్ 4వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. అయితే, ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ధరలు పెరగలేదని భావిస్తున్నారు.
మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినా.. ఆ తర్వాత రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. బల్క్ వినియోగదారులకు, బంకుల్లో సాధారణ పౌరులకు విక్రయించే ధరల్లో రూ.25 వరకు వ్యత్యాసం ఉన్నది. దీంతో హోల్సేల్ వినియోగదారులు పెట్రోల్ బంకుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
కంపెనీల నుంచి నేరుగా ట్యాంకర్లను బుక్ చేయడాన్ని నిలిపివేశాయి. దీంతో పెట్రోలియం కంపెనీలకు మరింత నష్టాలు పెరిగాయి. అయితే, రిటైల్ అవుట్లెట్లలో డిమాండ్ భారీగా పెరిగిందని జియో-బీపీ తెలిపింది. రిటైల్, పారిశ్రామిక ధరల్లో లీటరుకు రూ.25 వ్యత్యాసం ఉండడంతో హోల్సేల్ వినియోగదారులు రిటైల్ పెట్రోల్ పంపుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పింది.