Petrol Price | న్యూఢిల్లీ, మే 1: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెంచబోమంటూ ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీలు గుప్పించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగిసిన వెంటనే యూటర్న్ తీసుకుంది.
ముందుగా వాణిజ్య సిలిండర్ ధరను అమాంతం రూ. 933 పెంచేసి ప్రజలకు షాక్ ఇచ్చింది. ఈ ధరల పెంపు ఇంతటితో ఆగేలా లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు మరో వారం రోజుల్లోపల పెరిగే అవకాశం ఉందని ఉన్నత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెట్రోల్ ,డీజిల్ ధరలు లీటరుకు రూ. 4-5 పెరగవచ్చని వారు చెప్పారు. గృహ వినియోగ 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 40-50 పెరగవచ్చని తెలిపారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు ధరలు పెంచబోమంటూ బుకాయించిన కేంద్ర సర్కార్.. ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే ప్లేటు ఫిరాయించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా వాణిజ్య ఎల్పీజీ, పారిశ్రామిక డీజిల్, 5 కేజీల ఎల్పీజీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు విక్రయించే జెట్ ఫ్యూయల్ ధరలను శుక్రవారం పెంచాయి. ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 25-28 వరకు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయడం, దానికి ప్రతిగా ఇరాన్ జరిపిన భారీ ప్రతీకార చర్యల ఫలితంగా అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ ప్రతీకార చర్యల వల్ల ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్గాలలో ఒకటైన హొర్ముజ్ జలసంధి దాదాపుగా మూసివేతకు గురైంది. ఈ జలసంధి, పర్షియన్ గల్ఫ్ను ప్రపంచ మార్కెట్లకు అనుసంధానిస్తూ ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు ఐదవ వంతుతోపాటు గణనీయమైన పరిమాణంలో ఎల్ఎన్జీని కూడా నిర్వహిస్తున్నది.