ముంబై, మే 17: దేశంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని సాక్షాత్తు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, అధికారులు రోజూ ప్రకటిస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. ప్రతి రోజూ దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో పెట్రోల్ కొరతకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో తీవ్రంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. అకోలా నాక ప్రాంతంలో వందలాది మంది వాహనదారులు శనివారం ఒక పెట్రోల్ బంక్ వద్ద గుమిగూడి తోపులాటకు దిగి ఒకరినొకరు కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాషిమ్లోని ఒక పెట్రోల్ బంక్లోకి పెట్రోల్ దిగుమతి చేయడానికి వచ్చిన ఒక ఆయిల్ ట్యాంకర్ను సుమారు 400 మంది వాహనదారులు అడ్డుకున్నారు.
ముందు తమకు పెట్రోల్ పోయాలంటూ వారు డిమాండ్ చేశారు. అయితే బంక్లోని ఆటోమేటిక్ వ్యవస్థ ప్రకారం అన్లోడింగ్ సమయంలో పెట్రోల్ అమ్మకాలు సాగించడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని బంక్ నిర్వాహకులు పదేపదే విజ్ఞప్తి చేయడంతో వాహనదారులు వెనక్కి తగ్గి, ట్యాంకర్ అన్లోడింగ్కు అనుమతి ఇచ్చారు. తర్వాత వినియోగదారుల మధ్య తోపులాట ప్రారంభమై, అది ఘర్షణగా మారింది.
కొంతమంది అయితే పెద్దపెద్ద కర్రలు తీసుకువచ్చి అక్కడ ఉన్న వారిపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు, బంక్ సిబ్బంది జోక్యం చేసుకుని ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, తమకు పోలీస్ రక్షణ కల్పిస్తేనే తాము డీజిల్, పెట్రోల్ అమ్మకాలు సాగించగలమని, అధికార యంత్రాంగం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పలువురు బంక్ యజమానులు కోరారు.