హరిద్వార్ : ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కుంభమేళా కొనసాగుతోంది. పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు.
ఈ సందర్భంగా కుంభమేళా ఐజీ సంజయ్ గుంజుయాల్ స్పందించారు. అంచనాలకు మించి భక్తులు పుణ్యస్నానాలకు వస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్కు లేని వారి నుంచి చలాన్లు వసూలు చేయడం నిలిపివేశాం. ఒక వేళ చలాన్లు వసూలు చేయడం ప్రారంభించి, కొవిడ్ నిబంధనలు అమలు చేస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్నారు. ఈ జనంలో కొవిడ్ నిబంధనలు పాటించడం సాధ్యం కాదన్నారు.
ఎవరికివారు వ్యక్తిగతంగా కరోనా సోకకుండా జాగ్రత్త పడితేనే వైరస్ను అదుపు చేయగలమన్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సామాన్య భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతినిస్తున్నామన్నారు. ఆ తర్వాత అఖారాలకు అనుమతి ఇస్తామని చెప్పారు.