KCR | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అనేది వికాస్ (అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే) పార్టీ అని, మహారాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్రావ్ దేశ్ముఖ్ మేనల్లుడు, ప్రముఖ విద్యావేత్త, బీఆర్ఎస్ నాయకుడు సచిన్ దేశ్ముఖ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్రలో కేసీఆర్ అజేయ శక్తిగా మారనున్నారని, బీఆర్ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ విజన్తో అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి సరైన తొవ్వ చూపగలిగే సత్తా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్లాగా ప్రజలను అభివృద్ధి బాటపట్టించడంలో మహారాష్ట్ర నాయకులు విఫలమయ్యారని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు ఓటు బ్యాంకు రాజకీయాలతో విసిగిపోయారని, కేసీఆర్ అభివృద్ధి రాజకీయంపై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అనేదే ధర్మం అని, ఆ ధర్మాన్ని పాటిస్తున్న దేశంలోని ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
శివసేనను వీడి బీఆర్ఎస్లో ఎందుకు చేరారు?
2019 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరఫున పోటీచేశా. ఇక్కడి పార్టీలు ఓటుబ్యాంకు రాజకీయా ల్లో మునిగిపోయాయి. బీజేపీ, శివసేన హిందువుల ఓట్ల కోసం మత రాజకీయం చేస్తుండగా, సెక్యులర్, మైనార్టీల ఓట్ల కోసం కాంగ్రెస్, ఎన్సీపీ వెంపర్లాడుతున్నాయి. సామాన్యుల సమస్యలను పట్టించుకొనే సమయమే వాళ్లకు లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహారాష్ట్రలోనే ఉన్నా.. రాష్ట్ర ప్రజలకు గుక్కెడు నీళ్లు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నది. ప్రజలు తెలంగాణ తరహా అభివృద్ధి ని కోరుకొంటున్నారు. అందుకే బీఆర్ఎస్లో చేరాను.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర అభివృద్ధిబాట పడుతుందని విశ్వసిస్తున్నారా?
కేసీఆర్ నాయకత్వంలో 9 ఏండ్లలోనే తెలంగాణ గణనీయంగా పురోగతి సాధించింది. అక్కడి విజయ గాథలు ఇక్కడ కథలుగా చెప్పుకొంటున్నారు. తెలంగా ణ పథకాలను కేంద్రంతోపాటు పలు రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా కేసీఆర్ రైతుబం ధు పథకం ప్రవేశపెట్టి రైతులకు ఏడాదికి 10 వేల పెట్టుబడి అందిస్తున్నారు. దీని స్ఫూర్తితో కేంద్రంలో బీజేపీ సర్కారు అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతుబీ మాతో రైతు ఏ కారణంతో మరణించినా 5 లక్షలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రకూడా అభివృద్ధిబాట పడుతుందని బలంగా విశ్వసిస్తున్నా.
తెలంగాణ తరహా రైతు సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో అమలుకావాలని ఎందుకు భావిస్తున్నారు?
మహారాష్ట్రలోనే కాదు, దేశమంతా తెలంగాణ తరహా రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు ఎక్కువ. అటు కేంద్ర సర్కారుగానీ, ఇటు మహారాష్ట్ర సర్కారుగానీ ఆత్మహత్యలు ఆపేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించడమే లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం నన్ను ఆకర్షించింది. తెలంగాణ పథకాలు, సంక్షేమం మహారాష్ట్రలోనూ అమలైతే ఇక్కడి రైతుల తలరాతలే మారిపోతాయి.
ఓ విద్యావేత్తగా రాజకీయాలవైపు ఎందుకు ఆకర్షితులయ్యారు?
చదువు ప్రాముఖ్యత తెలుసు. రాజ్యాంగాన్ని గౌరవిస్తా. నాకు చిన్నప్పటినుంచి రాజకీయాలంటే ఆసక్తి. కాంగ్రెస్ మాజీ సీఎం విలాస్రావు దేశ్ముఖ్ నాకు మేనమామ. వారింట్లోనే పెరిగా. అధికారం ఉంటే సామాజిక సేవ చేయవచ్చని, అణగారిన వర్గాలకు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు, అధికారాలు అందేలా చూడొచ్చని బలంగా నమ్ముతాను. అందుకే పీఎస్బీ గ్లోబల్ ఎడ్యుకేషన్ అకాడమీని స్థాపించి, అందరికీ విద్యనందించాలని ప్రయత్నించా. 2019 ఎన్నికల్లో తలెత్తిన పరిస్థితులను చూసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా. సామాజిక సేవకు అధికారం తోడైతే భారత రాజ్యాంగం పేర్కొన్నట్టు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, అభివృద్ధి ఫలాలు అందేట్లు చేయవచ్చనే రాజకీయాల్లోకి వచ్చాను.
మత రాజకీయాలపై మీ అభిప్రాయమేంటి?
మతం అన్నది మనిషి నమ్మకానికి చెందినది. అది వ్యక్తిగతం. రాజకీయాల వరకు వస్తే.. ప్రజాస్వామ్య దేశమైన మనకు భారత రాజ్యాంగమే మనందరి మతం కావాలని కోరుకుంటాను. రాజ్యాంగం ప్రకారం సమాజంలోని అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా పాలన సాగాలి. దేశంలోని వివిధ రాష్ర్టాలు, ప్రాంతాల్లోని ప్రజలు, వారి నమ్మకాలు, అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా సామాజిక, ఆర్ధిక అభివృద్ధి జరగాలి. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకులందరూ అభివృద్ధే లక్ష్యంగానే రాజకీయాలు చేయాలి. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అభివృద్ధి రాజకీయాలకే పెద్దపీట వేస్తాం. బీఆర్ఎస్ను గ్రామ గ్రామానికి తీసుకెళ్లేందుకు నేను ఓ సైనికుడిగా పనిచేస్తా. కుల, మతాలకతీతంగా అభివృద్ధే మంత్రంగా బీఆర్ఎస్ రాజకీయం ఉంటుందని బలంగా నమ్ముతున్న.
20 ఏండ్లుగా ప్రజాజీవితంలోనే..
మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన సచిన్ దేశ్ముఖ్ కాటన్ మిల్లుతో వ్యాపార రంగంలో ప్రస్థానాన్ని ప్రారంభించిన 20 ఏండ్లలోనే దేశ, విదేశాల్లోనూ మంచి వ్యాపారవేత్తగా ఎదిగారు. పేద యువతులకు సామూహిక వివాహాలు, మెడికల్ క్యాంపులు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్, ఉద్యోగాలు, మందులు, నిత్యావసరాలు అందజేస్తూ గుర్తింపు తెచ్చుకొన్నారు. పీఎస్జీ గ్లోబల్ ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా నాణ్యమైన విద్యనందించేందుకు కృషిచేస్తున్నారు. జన్జాగృతి అభియాన్ ద్వారా ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ధూమపానం, మద్యపానం నుంచి దూరం చేసేందుకు ‘వ్యసన్ ముక్తి అభియాన్’ సంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజ్యాంగం పేర్కొన్నట్టుగా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, అభివృద్ధి ఫలాలు అందించేందుకు రాజకీయంలోకి వచ్చారు. 2019లో లాతూర్ రూరల్ నియోజకవర్గం నుంచి శివసేన తరపున పోటీ చేశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని చిత్తశుద్ధితో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.