శక్కర్నగర్, ఏప్రిల్ 18: బోధన్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 102 మందికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో 113మందికి పరీక్షలు నిర్వహించగా.. 49మందికి, రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 137 మందికి పరీక్షలు నిర్వహించగా 38 మందికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 85 మందికి పరీక్షలు నిర్వహించగా 15మందికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
ఎడపల్లిలో 36మందికి పాజిటివ్…
ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో ఆదివారం 99మందికి పరీక్షలు నిర్వహించగా.. 36మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.
కోటగిరి మండలంలో 16 మందికి..
కోటగిరి/సిరికొండ/మోస్రా(చందూర్), ఏప్రిల్ 18 : కోటగిరి మండలంలో 16 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ సమత తెలిపారు. పొతంగల్ పీహెచ్సీలో ఒకరికి, మంజీర చెక్పోస్టు వద్ద ఇద్దరికి, కోటగిరి సీహెచ్సీలో 13 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందన్నారు. సిరికొండ పీహెచ్సీలో 110 మందికి టెస్టులు నిర్వహించామని, 31 మంది వైరస్బారిన పడ్డారని మండల వైద్యాధికారి మోహన్ తెలిపారు. మోస్రా పీహెచ్సీలో 100 మందికి టెస్టులు నిర్వహించగా, 16 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారిణి స్వప్న తెలిపారు.
మోర్తాడ్లో ఆరుగురికి..
మోర్తాడ్, ఏప్రిల్18: మోర్తాడ్ సీహెచ్సీ, చౌట్పల్లి పీహెచ్సీలో కొవిడ్టెస్ట్లు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు సుమంత్కుమార్, రతన్సింగ్ తెలిపారు.
ఎడపల్లి మండల కేంద్రంలో కరోనా కట్టడికి తీర్మానాలు
ఎడపల్లి (శక్కర్నగర్), ఏప్రిల్ 18: ఎడపల్లి మండల కేంద్రంలో కరోనా కట్టడిలో భాగంగా సర్పంచ్ ఆకుల మాధవి, పాలకవర్గం నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.ప్రతిరోజూ ఉదయం 6నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4నుంచి 6గంటల వరకు మాత్రమే దుకాణాలు, హోటళ్లు, కిరాణాషాపులు తెరిచి ఉంచాలని తీర్మానించారు. వర్తకులు కచ్చితంగా మాస్కులు ధరించి వ్యాపారాలు కొనసాగించాలని లేని పక్షంలో వెయ్యి రూపాయల జరిమానా, దుకాణాల్లోకి మాస్క్ లేకుండా వెళ్లే వారికి రూ. 500 జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ప్రతి మంగళవారం నిర్వహించే వారాంతపు సంతను నాలుగు వారాల పాటు రద్దు చేస్తూ తీర్మానించారు.
ధర్పల్లిలో వారంరోజులపాటు లాక్డౌన్
ధర్పల్లి, ఏప్రిల్ 18 : కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ధర్పల్లిలో సోమవారం నుంచి వారం రోజులపాటు లాక్డౌన్ అమలుచేస్తున్నట్లు సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం వార్డు సభ్యులు, గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కరోనావ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వాంరోజులపాటు ప్రతిరోజూ ఉదయం 10 గంటల వరకే అన్ని రకాల వ్యాపార సముదాయాలు, దుకాణాలను తెరిచి ఉంచాలని, ఆ తరువాత మూసి ఉం చాలని సూచించారు. ప్రతి ఆదివారం నిర్వహించే వారసంతను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని, మళ్లీ ఎప్పుడూ ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. లాక్డౌన్కు సహకరించాలని ఈ సందర్భంగా సర్పంచ్ కోరారు.
ఆర్మూర్, ఆలూర్లో..
ఆర్మూర్, ఏప్రిల్ 18 : పట్టణంలోని 3వ వార్డు హౌసింగ్ బోర్డులో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. స్థానిక కౌన్సిలర్ వరలక్ష్మి ఆదివారం పలు ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్ దావ్రణాన్ని పిచికారీ చేయించారు. కాలనీవాసులందరూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఆర్మూర్ మండలంలోని ఆలూర్ గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గ్రామాభివృద్ధి కమిటీ, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ పాలకవర్గంసమావేశమై స్వచ్ఛంద లాక్డౌన్ అమలుచేయాలని నిర్ణయించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచాలని సూచించారు.