న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ హిందీ భాషపై బీజేపీ తన మంకుపట్టు వీడటం లేదు. ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదు. వేర్వేరు రాష్ర్టాలకు చెందిన ప్రజలు మాట్లాడుకొనేప్పుడు ఇంగ్లిష్, స్థానిక భాషల్లో కాకుండా హిందీలోనే తప్పక మాట్లాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునివ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇది ‘భారతదేశ భిన్నత్వంపై దాడి’ అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ‘హిందీ సామ్రాజ్యవాదం దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది’ అని ఆరోపించాయి. హిందీ మాట్లాడని రాష్ర్టాలపై హిందీని రుద్దడానికి బీజేపీ చేస్తున్న యత్నాలను అడ్డుకొంటామని టీఎంసీ పేర్కొన్నది.
బీజేపీ వ్యతిరేక ఉద్యమానికి ముందు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు అమిత్ షా వ్యాఖ్యలపై భగ్గుమన్నది. హిందీని ప్రజలపై రుద్దే విషయంలో బీజేపీ ఎప్పటికీ విజయం సాధించలేదన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమగ్రతకు వ్యతిరేకమన్నారు. ‘హిందీ అధికార భాషే కానీ, జాతీయ భాష కాదు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. హిందీ మాట్లాడని రాష్ర్టాలపై బీజేపీ సాంస్కృతిక ఉగ్రవాదానికి తెగబడుతున్నదని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. హిందీని జాతీయ భాషగా చేసే ప్రయత్నాలకు బదులు.. పెట్రోల్, డీజిల్, ఇతర ధరలను తగ్గించడంపై కేంద్రం ఎందుకు ఆలోచించదని టీఎంసీ నేత కునాల్ ఘోష్ ప్రశ్నించారు.
పార్లమెంటరీ అధికార భాష కమిటీ సమావేశం గురువారం జరిగింది. కమిటీకి అమిత్ షా చైర్పర్సన్గా ఉన్నారు. సమావేశంలో మాట్లాడుతూ.. ఇంగ్లిష్కు ప్రత్యామ్నాయంగా హిందీని తప్పక ఆమోదించాలన్నారు. వేరే భాషల పదాలను కలుపుతూ హిందీని సరళీకృతం చేయాలని ఆదేశించారు. పాఠశాల స్థాయిలో హిందీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.