ముంబై : ఓ ఐదు నెలల పసిబిడ్డ అరుదైన వ్యాధి(స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ)తో బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి భారత్లో చికిత్స అందుబాటులో లేదు. ఆ వ్యాధి నయం కావాలంటే అమెరికా నుంచి ఇంజెక్షన్ను దిగుమతి చేసుకోవాల్సిందే. ఆ ఇంజెక్షన్ ఖరీదు రూ. 16 కోట్లు. మరి ఓ మధ్యతరగతి కుటుంబానికి రూ. 16 కోట్లు సమకూర్చడమంటే కష్టం. దేశ వ్యాప్తంగా ఉన్న మానవతాహృదయులు అందరూ కలిసి ఆ బిడ్డను ప్రాణాలతో కాపాడేందుకు ముందుకొచ్చి కేవలం 42 రోజుల్లోనే రూ. 16 కోట్లు సాయం చేశారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్జీన్స్మా ఇంజెక్షన్ను దిగుమతి చేసుకున్నారు.
అహ్మదాబాద్కు చెందిన రాజ్దీప్ సిన్హ్ రాథోడ్ కుమారుడు ధరియారాజ్ సిన్హ్ రాథోడ్(ఐదు నెలలు) అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. దీంతో ముంబైలోని పీడీ హిందూజా ఆస్పత్రికి తరలించారు. చైల్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ నీలు దేశాయి ఆ బిడ్డను పరీక్షించి స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఈ వ్యాధి కేవలం 8 నుంచి 10 వేల మంది చిన్నారుల్లో ఒకరికి వస్తుందని తెలిపారు. అయితే ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే ప్రమాదమని ఆమె చెప్పారు. అమెరికాలో లభ్యమయ్యే జోల్జీన్స్మా ఇంజెక్షన్ను దిగుమతి చేసుకొని చికిత్స చేయాలని ఆమె చెప్పడంతో.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆ ఇంజెక్షన్కు కావాల్సిన రూ. 16 కోట్లు సేకరించారు. కేవలం 42 రోజుల్లోనే 2.64 లక్షల మంది సాయం చేశారు. ఆ నగదును బుధవారం అందజేశారు.