హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఆసరా వృద్ధాప్య పింఛన్లను అర్హులైనవారికి మూడ్రోజుల్లో మంజూరుచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా తయారీలో పారదర్శకత పాటించాలని సూచించారు. సోమవారం ఆయన బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, సోషల్ ఆడిట్ డైరెక్టర్ సౌమ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. శాఖలోని ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులతోపాటు, ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని సూచించారు. పల్లెప్రగతిలో నాటిన మొక్కలు వంద శాతం బతికేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ పర్యవేక్షణ బాధ్యతను ఎంపీడీవోలకు, డీఆర్డీవోలకు అప్పగించాలని పేర్కొన్నారు. విలేజ్ రిసోర్స్ పర్సన్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, పంపు మెకానిక్ల సమస్యల పరిష్కారానికి నివేదిక రూపొందించాలని ఆదేశించారు.