Hacking | న్యూఢిల్లీ, అక్టోబర్ 31: పెగాసస్ స్పైవేర్ వివాదం మరువకముందే దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపింది. గతంలో పెగాసస్ స్పైవేర్ ( Pegasus Spyware ) ద్వారా ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలపై మోదీ సర్కారు నిఘా పెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తగా.. తాజాగా పలువురు విపక్ష నేతల ఐఫోన్లను హ్యాక్ చేసేందుకు యత్నించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి ఒకేసారి ‘హ్యాకింగ్ అలర్ట్’ సందేశాలు రావడం సంచలనంగా మారింది.
‘ప్రభుత్వ మద్దతున్న హ్యాకర్ల నుంచి మీ ఐఫోన్కు హ్యాకింగ్ ముప్పు ఉన్నది. మీ యాపిల్ ఐడీ ద్వారానే మీ ఫోన్ను టార్గెట్ చేసే అవకాశం ఉన్నదని యాపిల్ భావిస్తున్నది. మీ ఫోన్లు హ్యాక్ అయితే సున్నితమైన డాటా, కమ్యూనికేషన్లను తస్కరించే ప్రమాదం ఉన్నది. కెమెరా, మైక్రోఫోన్లను యాక్సెస్ తీసుకొంటుంది. ఇది హెచ్చరిక నకిలీ కూడా కావొచ్చు. అయినప్పనటికీ దీన్ని సీరియస్గా తీసుకోండి’ అని ఆ సందేశం సారాంశం. దీనిపై రాజకీయ దుమారం రేగింది.
పలువురు ఎంపీలు, నేతలు తమ ఫోన్లకు వచ్చిన ఈ నోటిఫికేషన్ స్క్రీన్షాట్లను మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. విపక్ష పార్టీల ఎంపీల ఫోన్లను హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నదని దుమ్మెత్తిపోశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. యాపిల్ హ్యాకింగ్ అలర్ట్ సందేశాలపై దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తమ ఫోన్లను హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. తనతో పాటు పలువురు ఎంపీలు, నేతలకు ఈ సందేశం వచ్చిందని పేర్కొన్నారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు మహువా మొయిత్రా సందేశం పంపారు. హ్యాకింగ్పై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. తాను ఈ విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ ముందుకు కూడా తీసుకెళ్తానన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, గోప్యతకు భంగం వాటిల్లడం విచారకరమని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నదని, అందుకే విపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శించారు. మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ట్యాపింగ్లకు తాము భయపడేది లేదన్నారు. అదానీ అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను కేంద్రం రంగంలోకి దించుతున్నదని మండిపడ్డారు.
హ్యాకింగ్ అలర్ట్పై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ప్రధాని మోదీకి లేఖలు రాశారు. తన ఫోన్ను హ్యాకింగ్ చేయడం ద్వారా తనకు సంబంధం లేని సమాచారాన్ని తన ఫోన్లో చొప్పించేందుకు అవకాశం ఉన్నదని, తనపై నిందలు వేసేందుకు దాన్ని ఉపయోగించుంకొంటారని ప్రధానికి రాసిన లేఖలో ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు.
హ్యాకింగ్ అలర్ట్ వివాదంపై ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ స్పందించింది. కొన్ని యాపిల్ నోటిఫికేషన్లు నకిలీ కూడా కావొచ్చని పేర్కొన్నది. కొన్ని దాడులను గుర్తించలేం కూడా అని తెలిపింది. అయితే విపక్ష ఎంపీలకు హ్యాకింగ్ సందేశాలు ఎందుకు వచ్చాయన్నది మాత్రం చెప్పేందుకు యాపిల్ నిరాకరించింది. ‘ఈ అలర్ట్ నోటిఫికేషన్ జారీచేయడానికి గల కారణాలను మాత్రం మేం వెల్లడించలేం. ఎందుకంటే, దాన్ని బయటపెడితే హ్యాకర్లు భవిష్యత్తులో మా నిఘా నుంచి తప్పించుకొనే అవకాశముంది’ అని స్పష్టం చేసింది.
విపక్షాల ఆరోపణలను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం గొప్పగా పురోగమించడాన్ని చూడలేకనే విపక్షాలు ఇలాంటి విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అలర్ట్ నోటిఫికేషన్లు భారత్లో మాత్రమే గాక, 150 దేశాల్లోని యూజర్లకు వచ్చినట్టు యాపిల్ వర్గాలు స్పష్టం చేశాయని అన్నారు. అయితే దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందని, ఈ సందేశాలు వచ్చిన వారు దర్యాప్తునకు సహకరించాలని కోరారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఎంపీ శశిథరూర్, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఓఎస్డీ, ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్ సిద్దార్ధ వరదరాజన్ తదితరుల ఫోన్లకు ఈ హ్యాకింగ్ అలర్ట్ సందేశం వచ్చింది.