Pegasus Spyware | పౌరులపై నిఘా పెట్టేందుకు ఉపయోగించే పెగాసస్ స్పైవేర్ను కేవలం ప్రభుత్వాలకే విక్రయిస్తామని భారత్లో ఇజ్రాయెల్ రాయబారి నౌర్గిలోన్ చెప్పారు. ప్రభుత్వేతర వ్యక్తులకు విక్రయించబోమని తెలిపారు. భారత్లో ఇజ్రాయెల్ రాయబారిగా నౌర్ గిలోన్ ఇటీవలే నియమితులయ్యారు. అయితే స్పైవేర్ పెగాసస్పై వివాదం భారత్ అంతర్గత వ్యవహారం అని గురువారం జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్ ఎన్ఎస్వో గ్రూప్ స్పైవేర్ పెగాసస్ను కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకు స్వతంత్ర కమిటీని నియమించింది. అయితే, పెగాసస్పై భారత్లో జరుగుతున్న వివాదం ఆ దేశ అంతర్గత వ్యవహారం అని నౌర్ గిలోన్ పేర్కొన్నారు.
నేను ఇంతకు మించి వివరాలు వెల్లడించలేను. ఎన్ఎస్వో ఒక ఇజ్రాయెల్ ప్రైవేట్ కంపెనీ. ఈ స్పైవేర్ను ఎగుమతి చేయడానికి ఎన్ఎస్వోకు, ఇటువంటి కంపెనీలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి లైసెన్స్ అవసరం. ప్రభుత్వాల కోసం ఎగుమతి చేయడానికి మాత్రమే మా ప్రభుత్వం సదరు సంస్థలకు ఈ లైసెన్స్ జారీ చేస్తుంది అని చెప్పారు.