న్యూఢిల్లీ: మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీరియస్గా రియాక్ట్ అయ్యింది. డీజీసీఏ నిబంధనల మేరకు ఎయిరిండియా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని మండిపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.
అంతేగాక, ఘటనకు వేదికైన న్యూయార్క్-ఢిల్లీ విమానం పైలెట్ ఇన్చార్జి లైసెన్స్ను డీజీసీఏ మూడు నెలలపాటు రద్దు చేసింది. మరోవైపు మహిళపై మూత్రం పోసిన ప్రయాణికుడు శంకర్ మిశ్రాపై ఎయిరిండియా మరో నాలుగు నెలల ప్రయాణ నిషేధం విధించింది. గతంలో విధించిన 30 రోజుల ప్రయాణ నిషేధానికి ఇది అదనం.
కాగా, గత నవంబర్ 26న జరిగిన ఈ ఘటన విషయం ఆలస్యంగా ఈ నెల 4న డీజీసీఏ దృష్టికి వెళ్లింది. దీనిపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడానికి ఎందుకు ఆలస్యం జరిగిందంటూ ఎయిరిండియా అకౌంటబుల్ మేనేజర్, ఎయిరిండియా ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్కు, సదరు విమానం పైలట్లకు, సిబ్బందికి నోటీసులు జారీచేసింది.