ఐదు రోజుల పాటు వేడుకలు
31న ఆది దంపతుల వివాహం
ముస్తాబైన రాజన్న ఆలయం
వేములవాడ టౌన్, మార్చి 29 : ఆది దంపతుల కల్యాణోత్సవాలకు వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబైంది. కల్యాణ వేడుకలకు మండపాన్ని సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. మంగళవారం నుంచి శనివారం వరకు ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్యాణ వేడుకలు, రథోత్సవాన్ని ఆలయం లోపల అర్చకులు, ఆలయ అధికారుల సమక్షంలో నిర్వహించనున్నట్లు, కరోనా నిబంధనల మేరకు ఉత్సవాల్లో భక్తులు పాల్గొనే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఈ కళ్యాణోత్సవాలను అర్చకుల బృందం మంగళవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహిస్తుందని స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా 30వ తేదీ ఉదయం 7.15 గంటల నుంచి శివ భగత్పుణ్యాహ వాచనం, పంచగవ్య మిశ్రమం, దీక్షాధారణ, రుత్విక్ వరణం, నవగ్రహ ప్రతిష్ఠ, గౌరీ షోడశ మాతృకా ప్రతిష్ఠ, మృత్సంగ్రహణం, అంకురార్పణం, కుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ఠ, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వేద పారాయణాలు, పరివార దేవతలకు దేవతార్చన నిర్వహిస్తామని స్థానాచార్యులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల నుంచి శివ పురాణ ప్రవచనం, రాత్రి 7 గంటల నుంచి భేరి పూజ, దేవతాహ్వానం, నీరాజనం, తీర్థప్రసాద వితరణ ఉంటుందని వెల్లడించారు. 31న 10.50 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తాన ఆది దంపతుల కల్యాణం, ఏప్రిల్ 2న ఉదయం తీర్థ రాజపూజ, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బలిహరణం, సాయంత్రం రథప్రతిష్ఠ, రథోత్సవం, రాత్రి వసంతోత్సవం నిర్వహిస్తామని స్థానాచార్యులు వెల్లడించారు. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు ఆన్లైన్లో నిర్వహించుకునే ఆర్జిత సేవలు నిలిపివేస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
రియల్ ఎస్టేట్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన కారు
ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు