MUDA Scam : ముడా స్కామ్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా తోసిపుచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే సిద్ధరామయ్యపై కాషాయ పార్టీ అవినీతి ఆరోపణలు గుప్పిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు కాషాయ నేతలు ప్రయత్నించారని, మహారాష్ట్ర, జార్ఖండ్లో కూడా అదే జరిగిందని ఆరోపించారు.
కాషాయ నేతలు ఇప్పుడు కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ను కూలదోసేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారని, వారి ప్రయత్నాలు ఫలించబోవని పవన్ ఖేరా స్పష్టం చేశారు. కాగా, ముడా స్కామ్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య విచారణకు గవర్నర్ అనుమతించిన క్రమంలో సిద్ధరామయ్య సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కర్నాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అంతకుముందు డిమాండ్ చేశారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్లాక్మెయిల్కు తాము భయపడబోమని స్పష్టం చేశారు. అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా తాము మూడు నెలలుగా పోరాడుతున్నామని చెప్పారు.
గవర్నర్ స్పందించి సీఎం ప్రాసిక్యూషన్కు అనుమతించడంతో కాంగ్రెస్, సిద్ధరామయ్య ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. లూటీ చేసిన సొమ్ము ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్కు చేరవేయడంతో విపక్ష నేత రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను రాజీనామా చేయాలని కోరతారని తాము అనుకోవడం లేదని విజయేంద్ర వ్యాఖ్యానించారు. మరోవైపు ముడా స్కామ్లో ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణులు బెంగళూర్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.
Read More :