హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో కుండపోతగా వర్షం (Heavy Rain) కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మ్యాన్హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే చిన్నపాటి వర్షానికే నెమ్మదించే నగర ట్రాఫిక్ భారీ వర్షానికి స్తంభించిపోయింది. కాగా, నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాంనగర్లో(Ramnagar) ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో పాటు(Bike rider) వరదలో(Flood) కొట్టుకుతుండగా గమనించిన యువకులు వెంటనే కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు. కాగా, పంజాగుట్టలోని అపార్టుమెంట్ సుఖ్ నివాస్ అపార్టుమెంటు వద్ద పిడుగుపడింది (Lightning). షెడ్డుపై పిడుగు పడి కారు ధ్వంసమయింది. దీంతోపాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు.
హైదరాబాద్ – రాంనగర్లో భారీ వర్షాలకు వరదలో కొట్టుకుపోయిన ఓ ద్విచక్ర వాహనదారుడు.. కాపాడిన యువకులు. pic.twitter.com/ezNpRjnv3Y
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2024