పట్నా : హైకోర్టులోని న్యాయమూర్తులందరికీ ఐఫోన్ 13 ప్రొ అందచేయలని పట్నా హైకోర్టు నిర్ణయించింది. జడ్జిలందరికీ ఐఫోన్ 13 ప్రొ 256జీబీ మోడల్ను ఇచ్చేందుకు సరఫరాదారులు, అధీకృత డీలర్ల నుంచి హైకోర్టు టెండర్లను ఆహ్వానించింది. జీఎస్టీ, సర్వీస్ చార్జీలు కలుపుకుని మోడల్స్ ధరలను కోట్ చేయాలని ఆసక్తికలిగిన సరఫరాదారులను కోరింది.
సరఫరాదారులు, డీలర్లు తమ జీఎస్టీ నెంబర్, పాన్ వివరాలు, ఆధార్, ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వివరాలను పొందుపరచాలని టెండర్ నిబంధనల్లో పేర్కొంది. సంస్ధ ప్రదాన కార్యాలయం, షాపు, వాణిజ్య సంస్ధ పట్నాకు చెందినదై ఉండాలని స్పష్టం చేసింది. ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయబోమని, బిల్లులు సమర్పించిన తర్వాత నగదుకు బదులు బ్యాంక్ (సీఎఫ్ఎంఎస్) మోడ్ ద్వారా చెల్లింపులు ఉంటాయని తెలిపింది.
తాము కోరిన సమయంలో ఐఫోన్ మెయింటెనెన్స్ సేవలు అందించేందుకు సంస్ధ, సరఫరాదారు సిద్ధంగా ఉండాలని పట్నా హైకోర్టు పేర్కొంది. వారెంటీ పీరియడ్లో లోపభూయిష్టమైన పరికరాలను ఆయా సంస్ధలు తక్షణమే రీప్లేస్ చేయాలని కోరింది. ఐఫోన్ 14 సిరీస్ను సెప్టెంబర్లో లాంఛ్ చేసేందుకు యాపిల్ సన్నద్ధమవుతుండగా పట్నా హైకోర్టు ఐఫోన్ 13 కోసం ఆర్డర్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఐఫోన్ 14 సిరీస్లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ మోడల్స్ కస్టమర్ల ముందుకు రానున్నాయి.