పాట్నా, డిసెంబర్ 4: భూమాఫియాతో కుమ్మక్కై ఓ సామాన్యుడి ఇంటిని అక్రమంగా బుల్డోజర్లతో పోలీసులు కూల్చేయడంపై పాట్నా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమాషా చేస్తున్నారా? అని మండిపడింది. పాట్నాకు చెందిన సహ్యోగ దేవి అనే మహిళ ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అక్టోబర్ 15న పోలీసులు బుల్డోజర్లతో కూల్చేశారు. అక్రమ కేసులు బనాయించారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సందీప్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం.. పోలీసుల తీరును తప్పుపట్టింది.
‘ఇక్కడ కూడా బుల్డోజర్లు వాడుతున్నారా? మీరు ఎవరికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికా? ప్రైవేటు వ్యక్తులకా? భూ తగాదాలను పరిష్కరించే అధికారాన్ని పోలీస్ స్టేషన్లకు కూడా ఇచ్చారా? ఏదైనా వివాదం ఉన్న వ్యక్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లి లంచం ఇచ్చి ప్రత్యర్థి ఇంటిని కూల్చేయించవచ్చన్నమాట! ఇలాంటప్పుడు కోర్టులను ఎందుకు మూసేయకూడదు? వాటితో ఏం పని? భూమాఫియాకు చెందినవారితో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు చేతులు కలిపి పిటిషనర్ ఇంటిని అక్రమంగా కూల్చేశారు. ఇందుకు ప్రతివాదులు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ఇంటిని కూల్చేసిన అధికారులే ఈ సొమ్ము చెల్లించాలి. పిటిషనర్ భయపడాల్సిన పనిలేదు. మిమ్మల్ని కాపాడటానికి మేమున్నాం’ అని పేర్కొంది.