ఖైరతాబాద్, మార్చి 24 : ప్రకృతి, సహజ పంటలు ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో ఈ నెల 29, 30, 31 తేదీల్లో రవీంద్రభారతిలో ‘సహజ, సేంద్రియ ఉత్పత్తుల మేళా-2021’ నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, రైతునేస్తం వ్యవసాయ మాసపత్రిక సంపాదకుడు పద్మశ్రీ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వర రావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతునేస్తం ఫౌండేషన్, మాసపత్రిక, కర్షక సేవా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మేళా విశేషాలను రంగారెడ్డి జిల్లా సేంద్రియ రైతు నాగరత్నం నాయుడు, విశ్రాంత వ్యవసాయాధికారి టి. నరసింహదాసు, మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డితో కలిసి వివరించారు. 29న ఈ మేళాను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయ, సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ బి. జనార్దన్రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి. ప్రవీణ్రావు, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ డైరెక్టర్ ఎల్. వెంకట్రాంరెడ్డి తదితర ప్రముఖులు ప్రారంభిస్తారని తెలిపారు. సేంద్రియ సాగు ఆవశ్యకత, పాడి పశువుల పోషణ, సాగులో సరికొత్త యంత్రాలు తదితర అంశాలపై ప్రతి రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటలకు వరకు ఆయా రంగాల నిపుణులతో అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ మేళాలో ప్రవేశం ఉచితమని, వివరాల కోసం 9849312629, 7093973999, www.rythunestham.in/mela వెబ్సైట్లో సంప్రదించవచ్చన్నారు.