జైపూర్: డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఒక రోగి మరణించాడు. రాజస్థాన్లోని బాన్సువాడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల తేజ అనే వ్యక్తి దానాపూర్ గ్రామంలో ఉంటున్న కుమార్తె, అల్లుడు ఇంటికి వచ్చాడు. అతడు మూడు నెలలుగా అక్కడ ఉంటున్నాడు. అయితే గురువారం పొలంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. కంగారుపడిన కుమార్తె, అల్లుడు వెంటనే ప్రభుత్వ అంబులెన్స్కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రావడంతో బాన్సువాడా జిల్లా ఆసుపత్రికి అందులో తీసుకెళ్తున్నారు.
అయితే బాన్సువాడకు సుమారు పది కిలోమీటర్ల దూరంలోని రత్లాం రోడ్ టోల్ ప్లాజా సమీపంలో ఆ అంబులెన్స్ ఆగిపోయింది. ఏం అయ్యిందని రోగి బంధువులు డ్రైవర్ను అడగ్గా అంబులెన్స్లో డీజిల్ అయిపోయిందని చెప్పాడు. చేసేదేమీ లేక రోగి కుమార్తె, అల్లుడు కలిసి ఆ అంబులెన్స్ను సుమారు కిలోమీటరు దూరం వరకు తోశారు. ఇంతలో ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి రూ.500 విలువైన డీజిల్ కొని అంబులెన్స్ వద్దకు చేరుకున్నాడు. అంబులెన్స్లో డీజిల్ పోసినప్పటికీ అది ముందుకు కదలలేదు.
మరోవైపు మరో అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అది వచ్చి ఆ రోగిని అందులో తీసుకెళ్లే సరికి గంటకుపైగా సమయం గడిచింది. ప్రభుత్వ ఆసుపత్రికి చేరిన రోగిని పరిశీలించిన వైద్యులు అతడు చనిపోయినట్లు చెప్పారు. దీంతో రాజస్థాన్లో వైద్య సౌకర్యాల దుస్థితిపై విమర్శలు వెల్లువెత్తాయి.