లక్నో: ఉత్తరప్రదేశ్లో యోగీ ఆదిత్యనాథ్ సర్కారు నిర్లక్ష్యం ఉద్యోగార్థుల పాలిట శాపంగా మారింది. ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ప్రిలిమినరీ అర్హత పరీక్ష (UPSSSC PET or UP PET-2022) నిర్వహించిన ప్రభుత్వం.. అభ్యర్థులకు సరైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఇది ఉద్యోగార్థులు, ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. వేరే రవాణా సదుపాయాలు లేకపోవడంతో యూపీ పెట్-2022 అభ్యర్థులంతా రైళ్లను ఆశ్రయించారు.
దాంతో ప్రతి రైలులో బోగీలన్నీ కిక్కిరిసిపోయాయి. రద్దీ రైళ్లను ఎక్కలేక, దిగలేక పరీక్షార్థులు, ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. పైగా మితిమీరిన రద్దీవల్ల రైళ్లు మరింత ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. వందల మంది అభ్యర్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దాంతో చాలామంది అభ్యర్థులు పరీక్ష రాయకుండానే ఇండ్లకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
కాగా, ప్రభుత్వం సరైన రవాణా సౌకర్యాలు కల్పించకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజూ కాలేజీలకు వెళ్లేందుకే రద్దీ కారణంగా గంటల తరబడి రైల్వే స్టేషన్లలో నిలబడాల్సి వస్తుందని, అలాంటిది ఇవాళ పరీక్ష ఉన్నా పాలకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. రైళ్లు సరిగా లేక రోజూ ప్రయాణికులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నా.. ముఖ్యమంత్రి మాత్రం తన ర్యాలీలకు రైళ్లను తీసుకెళ్తారని వారు మండిపడ్డారు.
#WATCH | Uttar Pradesh: Passengers crammed into jam-packed railway coaches in Moradabad amid a massive rush of UP PET 2022 exam candidates returning from their exam centres to their homes pic.twitter.com/i8OZG2x3tW
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2022